న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)పై మరోసారి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విరుచుకుపడ్డారు. డబ్బు కోసం తన పార్లమెంట్ లాగిన్ ఐడీని అమ్ముకున్నట్లు ఎంపీ మహువాపై ఆరోపణలు చేసిన దూబే ఇవాళ మరో బాంబు పేల్చారు. ఎంపీ మహువా ఇండియాలో ఉన్న సమయంలోనే.. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని మాత్రం దుబాయ్ నుంచి ఓపెన్ చేశారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఈ విషయాన్ని దర్యాప్తు ఏజెన్సీలకు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత తెలిపారు. దేశ భద్రతను డబ్బు కోసం ఎంపీ మహువా అమ్మేసుకున్నట్లు దూబే తన ఎక్స్ అకౌంట్లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని, ఆర్ధిక శాఖ, సెంట్రల్ ఏజెన్సీలన్నీ ఎన్ఐసీనే వాడుతుంటాయని దూబే తెలిపారు. మరోవైపు దూబే చేసిన ఫిర్యాదు లోక్సభ ఎథిక్స్ కమిటీకి చేరింది. ఈ విషయంపై 26వ తేదీన కమిటీ ముందుకు రావాలని ఆయన్ను ఆదేశించారు. ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అదానీపై లోక్సభలో ప్రశ్నలు వేసేందుకు వ్యాపారవేత్త హీరానందని నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఎంపీ మహువాపై ఆరోపణలు ఉన్నాయి.