కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల్లో చేరికల పర్వం ఊపందుకుంది. సినీ నటుడు, దర్శకుడు ధీరజ్ పండిట్, నటి సుభద్ర ముఖర్జీ, గాయని ఆదితి మున్షీ, నటి బిర్బహ హన్స్డా, బీజేపీ మాజీ నేత ఉషా చౌధురి గురువారం పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరారు.
కోల్కతాలో పార్టీ ఎంపీ సౌగతా రాయ్ సమక్షంలో వారు టీఎంసీలో చేరారు. కాషాయ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు పార్టీని వీడటంతో పాలక పార్టీలో తాజా చేరికలు తృణమూల్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. మరోవైపు నందిగ్రాం నుంచి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్న మమతా బెనర్జీపై బీజేపీ తరపున సువేందు అధికారిని పోటీలో నిలపాలని కాషాయ పార్టీ యోచిస్తోంది.