కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. అక్కడ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా.. దానికి ముందూవెనుక కొన్ని రోజులు కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం కామన్గా మారింది. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
జిల్లాలోని హోతుగంజ్ ఏరియాలో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణల్లో బీజేపీ కార్యకర్తలు స్థానిక తృణమూల్ కార్యాలయంపై దాడిచేశారు. కార్యాలయం ఆవరణలో పార్క్ చేసి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తతో భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దించారు.
ఇటీవల బీజేపీ సీనియర్ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత సువేంధు అధికారి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్లో బహిరంగసభ నిర్వహించారు. ఆ సందర్భంగా హోతుగంజ్లో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణకు కొనసాగింపుగానే తాజా ఘర్షణలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.