Tirupati Laddu Row | తిరుమల శ్రీవారి ప్రసాదం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఈ అంశంపై ఆధ్మాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. ఈ ఘటన క్షమించరాదని.. హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారన్నారు. లడ్డూకే పరిమితం చేయకుండా మిగతా అన్ని పదార్థాలను తనిఖీ చేయాలన్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగిందో చరిత్ర పుస్తకాల్లో చదివామని.. లడ్డూ కారణంగా హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ఇప్పుడు చూస్తున్నామన్నారు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని శిక్షించాలని, ఆస్తులను జప్తు చేసి.. వారందరినీ జైల్లో పెట్టాలన్నారు.
మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ప్రశ్నించారు. ఆ నెయ్యిలో ఏం కలుస్తుందో ఎవరైనా తనిఖీ చేశారా? అన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ శాకాహారం అని పిలిచే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఆలయ నిర్వహణ సాధువులు, ఆధ్మాత్యికవేత్తల పర్యవేక్షణలో ఉందా? లేదా? అనేది చూడాలన్నారు. కమిటీలో ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ప్రధాన నిర్ణయాలు, ప్రతిదీ ఎస్జీపీసీ వంటి మతపరమైన బోర్డులు తీసుకోవాలన్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని.. ప్రస్తుతం టీడీపీ హయాంలో స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామన్నారు. ఆలయంలోని ప్రతి వస్తువును శానిటైజ్ చేసినట్లు వివరించారు.