బెంగళూరు: టిప్పు సుల్తాన్ (Tipu Sultan) చిత్రపటానికి చెప్పుల దండ వేయడం కలకలం రేపింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం సిర్వార్ ప్రాంతంలో ఉన్న మైసూర్ను పాలించిన టిప్పు సుల్తాన్ చిత్రపటానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఇది గమనించిన స్థానిక ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై టైర్లకు నిప్పంటించి ఆందోళనకు దిగారు.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. టిప్పు సుల్తాన్ చిత్రపటానికి ఉన్న చెప్పుల దండను తొలగించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసన విరమించారు. మరోవైపు ఈ సంఘటనపై సిర్వార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలో గతంలో కూడా టిప్పు సుల్తాన్ అంశంపై వివాదాలు చెలరేగాయి.