హైదరాబాద్ : తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి తమిళనాడులోని వెల్లింగ్టన్కు బయల్దేరిన బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం..
ఉదయం 9 : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు బయల్దేరారు.
ఉదయం 11:35 : తమిళనాడు కోయంబత్తూరులోని సూలూరు ఐఏఎఫ్ స్టేషన్లో ప్రత్యేక విమానం ల్యాండైంది.
ఉదయం 11:45 : నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, మధులికతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు IAF Mi-17V5 చాపర్లో కూనూరు ఎయిర్బేస్కు బయల్దేరారు.
మధ్యాహ్నం 12:20 : కూనూరు ఏరియాలోని కట్టేరి వద్ద ఐఏఎఫ్ చాపర్ క్రాష్ అయినట్లు వార్తలు వచ్చాయి.
మధ్యాహ్నం 12:25 : స్థానికులు ప్రమాదస్థలికి చేరుకుని పోలీసులను, అధికారులను అప్రమత్తం చేసి సమాచారం అందించారు. తక్షణమే ఆర్మీ, పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మధ్యాహ్నం 1:53 : IAF Mi-17V5 చాపర్ కూనూరు సమీపంలో కుప్పకూలినట్లు భారత వాయుసేన ట్వీట్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్.. హెలికాప్టర్లో ఉన్నట్టు ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని వాయుసేన ఆదేశించింది.
సాయంత్రం 6:30 : ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందినట్లు అధికారికంగా వాయుసేన ప్రకటించింది. మృతుల్లో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది సైనికులు ఉన్నట్లు పేర్కొన్నది. ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ విల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.