ఫతేహాబాద్: కేంద్రంలో సర్కారును మార్చే సమయం ఆసన్నమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర సర్కారును మార్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పనిచేయాల్సిన సమయం దగ్గర పడిందన్నారు. హర్యానాలోని ఫతేహాబాద్లో భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన సుదీర్ఘకాల నిరసన గురించి పవార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రైతులు ఎంత పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుతో నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆత్మహత్యలతో రైతుల సమస్య పరిష్కారం కాదని, సమస్యకు అసలు పరిష్కారం 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర సర్కారును మార్చడం ద్వారా లభిస్తుందని శరద్ పవార్ చెప్పారు. శరద్ పవార్తోపాటు నితీశ్ కుమార్, సీతారామ్ ఏచూరి, సుఖ్బీర్సింగ్ బాదల్, తేజస్వియాదవ్, ఓం ప్రకాష్ చౌతాలా కూడా పాల్గొన్న ఈ సభలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఇకపై థర్డ్ ఫ్రంట్ ఉండదన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర బీజేపీయేతర పార్టీలు అన్నీ కలిసి ఒక్కటే బలమైన ప్రతిపక్షం ఉంటుందని చెప్పారు.