న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జేఎన్ 1(JN.1 Cases ) వేరియంట్ కూడా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేటి వరకు ఆ వైరస్ వేరియంట్ సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 69కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. డిసెంబర్ 25వ తేదీ వరకు ఆ సంఖ్య ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 412కు చేరినట్లు ఆరోగ్యశాఖ ఇవాళ తెలిపింది. కర్నాటకలో తాజాగా ముగ్గురు కరోనాతో మృతిచెందారు. ఆదివారం వరకు జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసుల సంఖ్య 63గా ఉన్న విషయం తెలిసిందే. కేవలం గోవాలోనే ఒకే రోజు 34 జేఎన్ 1 వేరియంట్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్నాటకలో 8, కేరళలో ఆరుగురు, తమిళనాడులో నలుగురు, తెలంగాణలో ఇద్దరికి జేఎన్ 1 వేరియంట్ పాజిటివ్గా నమోదు అయ్యింది. జెఎన్ 1 సోకిన వారిలో స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.