Manipur | న్యూఢిల్లీ: గ్రామాలు, పట్టణాల పేర్లను అనధికారికంగా మార్చడంపై నిషేధం విధిస్తూ మణిపూర్ శాసన సభ ఓ బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రదేశాల అధికారిక పేర్లను ప్రభుత్వ అనుమతి లేకుండా మార్చేవారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నది.
మైతీలు, కుకీ-జో తెగల మధ్య ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఒక తెగ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రదేశాల అధికారిక పేర్లను మార్చేందుకు మరొక తెగ ప్రయత్నిస్తున్నదని, ఈ విధంగా అనధికారికంగా పేర్లను మార్చడం వల్ల అధికారుల విధి నిర్వహణకు సమస్యలు ఎదురవుతాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ చెప్పారు.