న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మధ్య డీసీజీఐ (DCGI) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వ్యాక్సినేషన్ సాగుతుండగా.. పిల్లలకు సంబంధించిన టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళశారం మూడు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చింది. ఇందులో భారత్ బయోటెక్ కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా జైకోవ్ డీ, బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ టీకాలున్నాయి. టీకాలు 5-12, 6-12 సంవత్సరాల మధ్య పిల్లలకు వేయనున్నారు. ఇప్పటికే మార్చి 16 నుంచి కోవిడ్కు వ్యతిరేకంగా 12-14 సంవత్సరాల పిల్లలకు టీకా వేస్తున్న విషయం తెలిసిందే.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) 6-12 సంవత్సరాల మధ్య పిల్లల కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్కు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. టీకాల పంపిణీ మొదలైన తర్వాత రెండు నెలల పాటు ప్రతి 15రోజులకోసారి భద్రతా డేటాను అందించాలని డీసీజీఐ భారత్ బయోటెక్ను ఆదేశించింది. ఆ తర్వాత ఐదు నెలల వరకు నెలకోసారి డేటా సమర్పించాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత సంవత్సరం ప్రారంభంలో డీసీజీఐ 12-18 ఏళ్ల సంవత్సరాల మధ్య వారికి కొవాగ్జిన్ టీకా వేసేందుకు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ – ప్లాస్మిడ్ ఆధారిత వ్యాక్సిన్ జైకోవ్ డీ. టీకాను అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా రూపొందించింది. 12 సంవత్సరాలుపైబడిన వారందరికీ టీకా వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అధికారం ఇచ్చింది. ఈ టీకా మూడు డోసులు కాగా.. సూది లేకుండానే టీకాను ప్రత్యేక పరికరం సహాయంతో వేయనున్నారు. ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్ను రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియన్ వద్ద నిల్వ చేయొచ్చు. కోల్డ్ చైన్లు అవసరం లేదు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సులభంగా రవాణా చేయొచ్చు. టీకా తయారీకి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (Biotechnology Industry Research Assistance Council) ఆధ్వర్యంలో నేషనల్ బయోఫార్మా మిషన్ (NBM) సహాయం అందించింది.
బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. టీకా 5-12 సంవత్సరాల మధ్య పిల్లలకు అందుబాటులోకి రానున్నది. భారత్లో తయారైన తొలి స్వదేశీ ఆర్బీడీ టీకా కార్బెవాక్స్. ఇది రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (RBD) ప్రోటీన్ సాంకేతికపై తయారు చేసిన టీకా ఇది. ఇప్పటికే కంపెనీ తయారు చేసిన ఈ టీకాకు గతేడాది డిసెంబర్ 28న పెద్ద వయస్సు వారికి వేసేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్లో 187.95కోట్ల డోసులు వేసినట్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.