న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరాయి. ఫ్రాన్స్ ఎయిర్బేస్ నుంచి మంగళవారం ఇవి టేకాఫ్ అయ్యాయి. పలు గంటలు ఏక ధాటిగా ఎగిరి మంగళవారం సాయంత్రం దేశంలో ల్యాండ్ అయ్యాయి. కాగా, ఈ మూడు రాఫెల్ యుద్ధ విమానాలకు యూఏఈ ఎయిర్ఫోర్స్ విమానాలు మార్గమధ్యలో ఇంధనం నింపి సహకరించాయని భారత వాయు సేన (ఐఏఎఫ్) బుధవారం తెలిపింది.
తాజాగా మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాల రాకతో దేశంలో వీటి సంఖ్య 35కు చేరింది. 2016 సెప్టెంబర్లో సుమారు 50 వేల కోట్ల వ్యయంతో 36 అత్యాధునిక రాఫెల్ జెట్ ఫైటర్స్ కొనుగోలుకు ఫ్రాన్స్తో మోదీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 35 రాఫెల్స్ సరఫరా అయ్యాయి. రెండు రాఫెల్స్ స్క్వాడ్రన్లను భారత వాయు సేన ఏర్పాటు చేసింది.
మరోవైపు ఆర్డర్లో చివరిదైన 36వ రాఫెల్ జెట్ ఫైటర్ మరి కొన్ని వారాల్లో ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు చేరిన 35 రాఫెల్ యుద్ధ విమానాల్లో 30 ఫైటర్ జెట్లు ఫ్రాన్స్ నుంచి టేకాఫ్ అనంతరం నేరుగా దేశంలో ల్యాండ్ అయ్యాయని వెల్లడించాయి.
కాగా, రాఫెల్ డీల్లో భారీగా అవినీతి జరిగిందంటూ విదేశీ మీడియా సంస్థలు పలు కథనాలు ప్రచురించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాఫెల్స్ అవినీతిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.