Explosion : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలో ఘోరం జరిగింది. దేవాస్ జిల్లా (Devas district) తొంకాలన్ గ్రామం (Thonkkalan Village) లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ పటాసుల ఫ్యాక్టరీ (Fire Crackers Factory) లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. వారిలో స్వల్పంగా గాయపడిన 13 మందిని దేవాస్ జిల్లా ఆస్పత్రి (Devas district hospitals) లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఇండోర్కు తరలించారు. గురువారం ఉదయం 11.30 నిమిషాలకు ఈ పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.
పటాసుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.