న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ముగ్గురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను ( Shaurya Chakra awards ) ప్రకటించింది. వారిలో ఇద్దరికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. పారిపోతున్న ఉగ్రవాదులను అడ్డగించి వారిపై కాల్పులు జరిపినందుకు జాట్ రెజిమెంట్కు చెందిన హవల్దార్ పింకూ కుమార్కు మరణానంతరం శౌర్యచక్ర అవార్డు దక్కింది.
పింకూకుమార్ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా, మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పింకూకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా తెలుగువాడైన సిపాయి మారుప్రోలు జశ్వంత్ కుమార్ రెడ్డికి కూడా మరణానంతరం శౌర్యచక్ర అవార్డును ప్రకటించారు. జమ్ముకశ్మీర్లో జరిగిన ముఖాముఖి కాల్పుల్లో ఈయన ఒక ఉగ్రవాదిని హతమార్చాడు.
ఉగ్రవాదుల కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి కూడా మరణించాడు. ఈ క్రమంలో జశ్వంత్ తమ టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడాడు. అదేవిధంగా అసోంలో ఇద్దరు చొరబాటుదారులను తుదముట్టించినందుకు 5 అసోం రైఫిల్స్కు చెందిన రైఫిల్ మ్యాన్ రాకేష్ శర్మకు శౌర్య చక్ర అవార్డు ప్రకటించారు.