న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: సారీ నాన్న. నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికల్లో ఒకరు రాసిన చివరి మాటలు ఇవి. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12, 14, 16 ఏండ్ల వయసున్న ముగ్గురు బాలికల ఆత్మహత్యకు గుర్తుతెలియని కొరియన్ టాస్క్-బేస్డ్ గేమింగ్ యాప్ కారణమని తొలుత వార్తలు వచ్చినప్పటికీ పోలీసులు ఆ తర్వాత గేమింగ్ యాప్ కోణాన్ని కొట్టివేశారు. కొరియన్ సంస్కృతి, కొరియన్ వినోదాన్ని తాము ప్రేమిస్తున్నట్లు ఆ బాలికలు తమ డైరీలో రాసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కొరియన్ సంస్కృతిని తాము ప్రేమిస్తున్నామని, కే-పాప్ సంస్కృతి, కొరియన్ సినిమాలు, కొరియన్ సంగీతం, కొరియన్ షార్ట్ ఫిల్మ్స్, కొరియన్ షోలు, కొరియన్ కథలను తాము ఇష్టపడుతున్నట్లు తమ డైరీలో వారు రాసుకున్నారు. తమ కుమార్తెలు అటువంటి కంటెంట్ను చూడడంపై అభ్యంతరం తెలిపిన బాలికల తల్లిదండ్రులు వారి ఫోన్లను లాక్కున్నారని, ఈ కారణంగానే ఆ బాలికలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి. బాలికల తండ్రి చేతన్ కుమార్ ఓ సాధారణ కుటుంబీకుడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి ఐదుగురు సంతానం. వారంతా ఒకే ఇంట్లో కలసి ఉంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికల్లో ఒకరు మొదటి భార్య కుమార్తె కాగా మిగిలిన ఇద్దరు రెండో భార్య పిల్లలు. మొదటి భార్యకు సంతానం కలగడంలో ఆలస్యం కావడంతో చేతన్ కుమార్ తన భార్య చెల్లెలినే ద్వితీయ వివాహం చేసుకున్నాడు.
సూసైడ్ నోట్ లభ్యం
మృతుల గదిలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఏడుస్తున్న ఎమోజీతో ఉన్న ఆ లేఖలో ఈ డైరీలో రాసినవన్నీ నిజాలని, దీన్ని పూర్తిగా చదవాలని నోట్లో రాసిన బాలికలు.. రియల్లీ సారీ, సారీ పప్పా అంటూ తమ తండ్రికి క్షమాపణ చెప్పారు. సూసైడ్ నోట్ను దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల గదిలో నేలమీద చిందరవందరగా పడి ఉన్న కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా పోలీసులకు లభించాయి. అంతేగాక గదిలోని గోడపై నేను చాలా చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. నా జీవితం చాలా చాలా ఒంటరిది అన్న రాతలు కూడా కనిపించాయి.
తన కుమార్తెలు ఆన్లైన్ టాస్క్ బేస్డ్ గేమ్ ఆడుతున్నారని తనకు తెలియదని చేతన్ కుమార్ పోలీసులకు తెలిపారు. నిన్ననే వాళ్లు ఓ టాస్క్ని కూడా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. చనిపోవాలన్న టాస్క్ ఇచ్చే గేమ్ గురించి తనకు తెలియదని, వాళ్లు లూడో ఆడుతున్నారని తాను భావించానని ఆయన చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన బాలికలు కొరియన్ సంస్కృతికి ప్రభావితులైనట్లు డీసీపీ నిమీష్ పాటిల్ తెలిపారు. కొన్ని రోజులుగా కుటుంబ పెద్దలు తమ పిల్లల నుంచి మొబైల్ ఫోన్లు లాగేసుకున్నారని, టాస్కులు లేదా ఆన్లైన్ గేమ్ గురించి సమాచారం ఏదీ తమకు లభించలేదని ఆయన చెప్పారు. ఆ బాలికలు ఆన్లైన్ గేమ్లు ఆడారా లేదా అన్న విషయాన్ని సైబర్ నిపుణులు నిర్ధారిస్తారని పోలీసులు చెప్పారు.