రాంచీ : జార్ఖండ్లోని గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందుపై ఎలుకలు దాడి చేసి, కొరికాయి. ఈ ఘటన మే 2వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 29న మమతా దేవీ అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డుకు తరలించారు. అయితే ఆ పసికందును పరీక్షించిన వైద్యులు.. పాప జాండిస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో పాపకు అక్కడే చికిత్స అందిస్తున్న క్రమంలో ఎలుకలు మోకాళ్ల కింది భాగంలో దారుణంగా కొరికాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్బాద్లోని షాహీద్ నిర్మల్ మాహ్తో మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు సీరియస్గా స్పందించారు. విచారణకు ఆదేశించారు. ఇద్దరు నర్సులను విధుల నుంచి తొలగించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్పై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.