Ayodhya Ram Janmabhoomi | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి పనులు పూర్తి చేసి.. భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రామజన్మభూమి కాంప్లెక్స్కు తాజాగా బాంబు బెదిరింపు రావడం కలకలం రేగుతోంది. రామజన్మభూమి కాంప్లెక్స్ను పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి తనకు బెదిరింపు కాల్ చేసినట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయోధ్య పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యలోని రాంలాలా సదన్కు చెందిన మనోజ్ కుమార్ ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మనోజ్కు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబుతో పేల్చేస్తామని బెదిరించి కాల్ పెట్టేశాడు. దీంతో భయాందోళనకు గురైన మనోజ్.. ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అయోధ్య పోలీసులు తెలిపారు. కాల్ ట్రాకింగ్ ఆధారంగా దుండగుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో అయోధ్యలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆలయ సముదాయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.