గువాహతి: ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలను అరెస్ట్ చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరమని తెలిపారు. ఆ వ్యక్తి చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భర్త అయినప్పటికీ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. శనివారం జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడారు. మహిళలు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు 18 ఏళ్లు అని తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ వయస్సు వివాహాలు, మాతృత్వాన్ని ఆపడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తక్కువ వయసు అమ్మాయిలను వివాహం చేసుకున్న భర్తలపై కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి భర్తలు జీవిత ఖైదు ఎదుర్కొంటారని అన్నారు. రాబోయే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్టు అవుతారని హెచ్చరించారు.
కాగా, మాతృత్వానికి తగిన వయసు 22-30 ఏళ్లని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. తగిన వయస్సులో మాతృత్వాన్ని స్వీకరించకపోతే వైద్యపరమైన సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంకా పెళ్లి కాని ఆడవాళ్ళు త్వరగా వివాహం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అస్సాం మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. అలాగే 14 నుంచి 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న మాతా శిశు మరణాల రేటును అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.