న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు (Wrestlers protest) రైతులు సంఘీభావం ప్రకటించారు. ఆదివారం వేలాది మంది అన్నదాతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు రానున్నారు. నిరసన చేస్తున్న రెజ్లర్లకు తమ మద్దతు తెలుపనున్నారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల కూటమి అయిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మహిళా మల్లయోధులకు మద్దతుగా నిలిచింది. బ్రిజ్ భూషణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
కాగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు నేతలు, వేలాది మంది రైతులు ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకోనున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి నిరసన చేస్తున్న రెజ్లర్లకు సంఘీభావం తెలుపనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి, కేంద్ర క్రీడల మంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ను రైతు బృందాలు కలువనున్నాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో కేసు నమోదు చేసిన బ్రిజ్ భూషణ్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 11 నుంచి 18 వరకు దేశంలోని అని రాష్ట్రాల రాజధానులు, జిల్లాల హెడ్ క్వార్టర్లలో ఆందోళనలు చేపట్టనున్నారు.