బెంగళూరు : ఒక సామాన్యుడు చనిపోతే ఆయన అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారు. అదే ప్రముఖ నాయకుడో, ఆధ్యాత్మిక గురువో, సినీ హీరోనో చనిపోతే, వారి అంతిమయాత్రకు వేలాది మంది హాజరై శ్రద్ధాంజలి ఘటిస్తారు. మరి బిచ్చగాళ్లు చనిపోతే ఎవరికీ కూడా కడసారికి నోచుకోరు. కనీసం అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. ఏ స్వచ్ఛంద సంస్థనో ఆ యాచకుల అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వాన్ని చాటుకుంటారు. కానీ ఓ బిచ్చగాడు చనిపోతే, అతని అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు. ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అసలు ఆ యాచకుడు ఎవరు? మరి ఆ బిచ్చగాడికి ఎందుకంతా క్రేజ్? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
కర్ణాటక బళ్లారి జిల్లాలో బసవ అలియాస్ హచ్చబస్య(45) అనే యాచకుడు హడగళ్లి పట్టణంలో నివసిస్తుంటాడు. ఈ యాచకుడు హడగళ్లి పట్టణ ప్రజలకు ఎంతో సుపరిచితుడు. బసవను స్థానికులంతా అదృష్టవంతుడిగా భావిస్తుంటారు. అతనికి ఒక రూపాయి ఇచ్చి వెళ్తే మంచి జరుగుతదని నమ్ముతుంటారు. రూపాయికి కన్నా ఎక్కువ ఇచ్చినా.. మిగిలిన డబ్బును తిరిగి ఇచ్చేవాడు బసవ. అక్కడి ప్రజలను బసవ ప్రేమగా అప్పాజీ అని పిలిచేవాడు. స్థానికులు ఆయనను అదృష్ట బసవ అని పిలిచి ప్రేమను పంచేవారు.
మాజీ డిప్యూటీ సీఎం ప్రకాశ్, మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ బసవతో పాటు మరికొంత మంది నాయకులను పేరు పెట్టి పిలిచి, ఒక రూపాయి అడిగేవాడు బసవ. అంతటి అమాయకుడు బసవ.. హడగళ్లి పట్టణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
అయితే బసవ రోడ్డుప్రమాదంలో శనివారం మృతి చెందాడు. దీంతో అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు హడగళ్లి పట్టణ ప్రజలంతా తరలివచ్చారు. పట్టణమంతా బసవ ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం రోజు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.