Nitish Kumar | వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీఏకు సారధ్యం వహిస్తున్న బీజేపీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొని తెచ్చుకోవడమేనని బీహార్ సీఎం, జేడీయూ నే నితీశ్ కుమార్ అన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మధ్య ఐక్యత కోసం తాను కృషి చేస్తున్నానని చెప్పారు. తాను విపక్షాల ఐక్యత కోసం పని చేస్తున్నా.. ప్రధాని పదవికి పోటీలో లేనని అన్నారు.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందే విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వస్తున్నాయని నితీశ్ కుమార్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ప్రస్తుతం తన ముందు ఉన్న ఏకైక లక్ష్యం అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసేవారు తమతోపాటు దేశానికీ విధ్వంసం కొని తెచ్చుకోవడమేనన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ సుపరిపాలన అందుబాటులోకి రావాలంటే విపక్షాలకు ఓటేయాలన్నారు.
విపక్షాల మధ్య ఐక్యత కోసమే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలతో తాను సమావేశమైనట్లు నితీశ్ కుమార్ తెలిపారు. తాను పాల్గొన్న సమావేశాలన్నీ సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఇతర పార్టీల నేతలతోనూ మాట్లాడతానని చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మత పరంగా సమాజాన్ని చీల్చడం తప్ప దేశానికి చేసిందేమీ లేదని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. అందుకే దేశ చరిత్రను మార్చాలని ఆ పార్టీ భావిస్తున్నదని తెలిపారు. ఇటీవల బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో కలిసి ఢిల్లీలో పర్యటించిన నితీశ్ కుమార్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో సమావేశమయ్యారు.