ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోబోనని తెలిపారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి ఈ మేరకు మెసేజ్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్, కూటమిలోని ఇతర సీనియర్ నేతలతో పాటు ఉద్ధవ్ ఠాక్రే కూడా మీడియాతో మాట్లాడారు. ఏక్నాథ్ షిండే శిబిరంలోని శివసేన నాయకులను వెనక్కి తీసుకునే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘నన్ను విడిచిపెట్టిన వారిని పార్టీలోకి తిరిగి తీసుకోను’ అని స్పష్టం చేశారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష కూటమి కలిసి పోటీ చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ పోరాటమని చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం మాదిరిగా మారిందని అన్నారు. ఈ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. తమ ఎంవీఏ ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారని, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు.