బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల ఇబ్బందులు, కనీస మద్దతు ధర పెంపు, చెరుకు ధర… లాంటి విషయాల్లో తానొక్కణ్నే గట్టిగా మాట్లాడుతున్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ విషయాలపై మాట్లాడడానికి ఇతర ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం దమ్ము, ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ వారికి టిక్కెట్లు ఇవ్వదన్న ఏకైక భయంతోనే ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.
ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ప్రజా సమస్యలను మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడతారని సూటిగా ప్రశ్నించారు. ”వారందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లివ్వదని భయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులే ప్రశ్నించకుంటే ఇంకెవరు ప్రశ్నిస్తారు నాకు టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదు. నా తల్లి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి మరీ విజయం సాధించింది. ప్రభుత్వాలు మారినా నేను మాత్రం సత్యమే మాట్లాడతా” అంటూ వరుణ్ గాంధీ తేల్చి చెప్పారు.