Suresh Gopi : కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపి.. ఒక్క రోజు కూడా తిరగకుండానే ఆ పదవికి రాజీనామా చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అదంతా ఉత్త ప్రచారామేనని తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేరళను అభివృద్ధి చేయాలని తాము నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.
ఈ మేరకు సురేష్ గోపి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘కొన్ని మీడియా సంస్థలు తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ తప్పుడు వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. అది పూర్తిగా అబద్ధం. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాము కృతనిశ్చయంతో ఉన్నాం’ అని సురేష్ గోపి తన పోస్టులో పేర్కొన్నారు.
సురేష్ గోపి కేరళలోని త్రిసూరు లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీ తరఫున ఎంపికైన తొలి ఎంపీగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కింది. దాంతో ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
సహాయ మంత్రి పదవి చేపట్టడం సురేష్ గోపికి ఇష్టం లేదని, అందుకే ఆయన సినిమా షూటింగ్ల పేరు చెప్పి మంత్రి పదవిని వదులుకోవాలని చూస్తున్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అదంతా తప్పుడు ప్రచారమని సురేష్ గోపి కొట్టిపారేశారు.
A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi Government. This is grossly incorrect. Under the leadership of PM @narendramodi Ji we are committed to the development and prosperity of Kerala ❤️ pic.twitter.com/HTmyCYY50H
— Suressh Gopi (@TheSureshGopi) June 10, 2024