గాంధీనగర్: ఇండియన్ రైల్వేస్ తొలిసారిగా రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించబోతోంది. గుజరాత్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ను రీడెవలప్ చేయనున్న రైల్వేస్.. అందులో భాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఎస్ఆర్డీసీ), గుజరాత్ ప్రభుత్వంతో చేతులు కలపనుంది. ఈ ప్రాజెక్ట్ గాంధీనగర్ రైల్వే స్టేషన్ను 24 గంటలూ నడిచే వరల్డ్క్లాస్ ట్రావెల్ హబ్గా మార్చనుంది.
22 అడుగుల ఎత్తులో.. 300 గదులతో..
ఈ ఫైవ్ స్టార్ హోటల్ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. గాంధీనగర్ రైల్వే స్టేషన్లోని పట్టాలపై పిల్లర్లు నిర్మించి.. దానిపై ఈ ఫైవ్ స్టార్ హోటల్ను కట్టనున్నారు. భూమి నుంచి 22 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఈ స్టార్ హోటల్లో మొత్తం 300 గదులు ఉండనున్నాయి. పైనుంచి చూస్తే పూరేకులుగా కనిపించేలా మూడు టవర్లను నిర్మిస్తారు.
ఈ హోటల్ ప్రాజెక్ట్పై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ స్పందించారు. ఇది ప్రత్యేకమైన మోడల్. కింద రైళ్లు తిరుగుతున్నా.. వాటి చప్పుడు, ప్రకంపనలు హోటల్లో ఉన్న వారికి తెలియకుండా డిజైన్ చేస్తున్నామని చెప్పారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. ఇండియాలో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని ఆయన తెలిపారు. ఈ హోటల్ గతేడాది డిసెంబర్లోనే పూర్తవ్వాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యమైంది. త్వరలోనే ఈ లగ్జరీ హోటల్ ప్రారంభం కానుంది.