కౌశాంబి: వివాదాస్పద వ్యవసాయ చట్టాలు ఎట్టకేలకు రద్దయ్యాయి. ఇవాళ లోక్సభ ప్రారంభం కాగానే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటింగ్ పద్ధతిలో ఆ బిల్లుకు సభ ఆమోదం లభించింది. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ స్పందించారు. ఈ వ్యవసాయ చట్టాల రద్దు వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ మరణించిన 750 మంది రైతులకు నివాళి అని వ్యాఖ్యానించారు.
అయితే, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ తమ ఆందోళన కొనసాగుతుందని రాకేశ్ తికాయిత్ స్పష్టంచేశారు. పంటలకు కనీస మద్దతు ధర సహా ఇంకా ఇతర అంశాలు పెండింగ్ ఉన్నాయని, ఆ డిమాండ్లు అన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తికాయిత్ చెప్పారు. కాగా, ఏడాది క్రితం కేంద్ర తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం నుంచి రైతులు ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.