అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ్వాదీ ఎన్నడూ దృష్టి సారించలేదని విమర్శించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని కొన్ని ప్రాంతాల ప్రజలతో వర్చువల్గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వమే రైతులకు అధికంగా మేలు చేసిందని చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కనీస మద్దతు ధర నేరుగా రైతుల అకౌంట్లలోకి చేరేట్లుగా ప్రణాళికలు వేసిందని పేర్కొన్నారు. అయితే ఈ మధ్య ప్రతిపక్షాలు కనీస మద్దతు ధర విషయంలో లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. నకిలీ సమాజ్వాదీ వారు తమ తమ వ్యాపారాలను, పనులు మానుకొని, కేవలం ప్రజలను దోచుకోవడమే పెద్ద పనిగా పెట్టుకున్నారని, ల్యాండ్ మాఫియాలు చేస్తూ.. తమ కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేసుకున్నారని మోదీ ఆరోపించారు. యూపీ ప్రజలు ఈ విషయాన్ని ఇప్పుడు బాగా గ్రహించారన్నారు.
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత యూపీ అనేక ఎన్నికలను చూసిందని, అనే కప్రభుత్వాలు వచ్చి పోవడాన్ని కూడా చూసిందన్నారు. కానీ ఈ ఎన్నికలు మాత్రం అన్ని ఎన్నికల కంటే భిన్నమైనవిగా మోదీ అభివర్ణించారు. గౌరవం, ఓ గుర్తింపు, శ్రేయస్సు వీటిని నిలబెట్టడానికి జరుగుతున్న ఎన్నికలని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు చక్కెర మిల్లులను మూసేశాయని, బకాయిలను కూడా చెల్లించలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం మాత్ర పాత బకాయిలను క్లియర్ చేసిందని, కొత్త యూనిట్లను ప్రారంభించిందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.