పాట్నా : ప్రిన్సిపల్ పోస్టు కోసం ఓ టీచర్తో పాటు మరో మహిళా టీచర్ భర్త కొట్టుకున్న ఘటన బీహార్లోని మోతీహరిలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. శివశంకర్ గిరి, రింకీ కుమారి అనే ఇద్దరు టీచర్లు బీహార్లోని అదాపూర్ ప్రైమరీ పాఠశాలలో పని చేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ పోస్టు కోసం వీరిద్దరి మధ్య గత మూడు నెలల నుంచి వాగ్వాదం కొనసాగుతోంది.
ఈ క్రమంలో గురువారం గిరి, రింకీ కలిసి మోతిహరిలోని స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వచ్చారు. వీరిద్దరి సమస్య విన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ ఇద్దరు టీచర్ల ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. ఎవరు మొదట డాక్యుమెంట్స్ సమర్పిస్తారు అనే విషయంలో శివశంకర్ గిరికి, రింకీ భర్తకు మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఒకరికొకరు దూషించుకున్నారు. ఆ తర్వాత రింకీ భర్త.. గిరిని కిందపడేసి కొట్టాడు. అక్కడే ఉన్న సిబ్బంది.. వారిద్దరిని విడిపించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.