న్యూఢిల్లీ: వచ్చే పండుగల సీజన్లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణకు అవకాశం ఉన్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా హెచ్చరించారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ‘వచ్చేది పండుగల సీజన్. కాబట్టి ఈ సమయంలో మనం అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మరో 6 నుంచి 8 వారాలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉంటే.. ఆ తర్వాత కరోనా కేసులు బాగా తగ్గిపోతాయి’ అని గులేరియా చెప్పారు.
‘ఈ రెండు నెలల్లో దసరా, దీపావళి, ఛట్ పూజ లాంటి అనేక పండుగలు ఉన్నాయి. ప్రజలు కొవిడ్ నియమావళిని పాటించకపోతే ఈ పండుగలతోపాటే కరోనా థర్డ్ వేవ్ కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు’ అని గులేరియా వ్యాఖ్యానించారు. ఈ మేరకు గత నెలలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ చేసిన హెచ్చరికలను కూడా రణ్దీప్ గులేరియా గుర్తుచేశారు. గత నెల జరిగిన డీడీఎంఏ సమావేశంలో మాట్లాడిన వీకే పౌల్.. పండుగలను ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సింపుల్గా చేసుకోవాలని సూచించారు.
కొవిడ్ నియమావళిని లెక్కచేయకుండా ఆడంబరంగా పండుగలు జరుపుకుంటే.. కరోనా మహమ్మారి వ్యతిరేక పోరాటంలో ఇప్పటివరకు మనం సాధించిన విజయాలన్నీ ఒక్కసారిగా రివర్స్ అవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు పండుగలను చాలా సింపుల్గా చేసుకోవాలని గులేరియా సూచించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారని, పండుగలతోపాటే మహమ్మారి విస్తరిస్తుందని చెబుతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు.