బెంగళూరు : సెకండ్వేవ్ ఇక ముగుస్తుందనుకుంటున్న తరుణంలో.. థర్డ్వేవ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా హెచ్చరించడం చూస్తూనే ఉన్నాం. ఈ ఊహాగానాలతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త ఇది. భారత్లో థర్డ్వేవ్ రావటం అనివార్యమేమీ కాదని, అసలు అది రాకపోవచ్చునని.. వచ్చినా టీకాలతో ఎదుర్కోవచ్చనని దేశంలోని వైద్యనిపుణులు భరోసా ఇస్తున్నారు. ఒకరకంగా కరోనా ఇక ముగిసినట్లేనని, ఇంకో నెలా రెండు నెలల్లో అది ఒక అంటువ్యాధి స్థాయి నుంచి సాధారణ వ్యాధి స్థాయికి క్షీణిస్తుందని, ఈ ఏడాదిలోపు దాని ప్రభావం దాదాపుగా మాయమవుతుందని చెబుతున్నారు.
‘కరోనా మరో కొత్తరూపంలో (కొత్త వేరియంట్గా) ముందుకొస్తే తప్ప థర్డ్వేవ్ ప్రమాదముండదు. ప్రస్తుతమున్న కరోనా వేరియంట్లు మళ్లీ కొత్త వేవ్ను సృష్టించలేవు. భారత్లో సెకండ్వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్కు, బ్రిటన్ తదితర దేశాల్లో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్కు పెద్దగా తేడాలేమీ లేవు. పైగా ఈ వేరియంట్లు ఇప్పుడు క్షీణదశలో ఉన్నాయి. జూలై నెలాఖరుకు కరోనా మహమ్మారి స్థాయి నుంచి సాధారణ వ్యాధి స్థాయికి పడిపోతుంది. దాని సాంక్రమిక తీవ్రత కూడా తగ్గుతుంది.మరోవైపు, ఇప్పటికే దేశప్రజానీకంలో చాలామంది తమకు తెలియకుండానే కరోనాకు గురై తమ సహజ రోగనిరోధకవ్యవస్థ ద్వారా దాన్నించి బయటపడ్డారు. సమర్థవంతమైన వ్యాక్సినేషన్ వ్యూహంతో ఈ ఏడాదిలోనే మనం కరోనా నుంచి పూర్తిగా బయటపడవచ్చు’
–డాక్టర్ టీ జాకబ్ జాన్, ప్రఖ్యాత వైరాలజిస్టు (అంటువ్యాధుల నిపుణుడు),
సీఎంసీ వేలూర్ మాజీ ప్రొఫెసర్, డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత
‘కరోనా మరోసారి విరుచుకుపడుతుందని చెప్పటానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుందని చాలామంది జాగ్రత్తలను, నిబంధనలను పట్టించుకోవటం లేదు. ఈ నిర్లక్ష్యంతో మళ్లీ మహమ్మారి తీవ్రతరమయ్యే ప్రమాదం మాత్రం ఉంటుంది’
-డాక్టర్ విజయ, వైరాలజిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ ప్రొఫెసర్
థర్డ్వేవ్ వచ్చినా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అక్టోబర్ తర్వాతే ఆ ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది. థర్డ్వేవ్ వచ్చినా రాకున్నా మనం మాత్రం తగినన్ని మౌలిక సదుపాయాలతో, మానవ వనరులతో సిద్ధంగా ఉంటే ఒకవేళ వచ్చినా దానిని సమర్థంగా ఎదుర్కోగలం.
-డాక్టర్ ఎంకే సుదర్శన్, చైర్మన్, కర్ణాటక కొవిడ్-19 సాంకేతిక సలహా కమిటీ