పాట్నా: మొబైల్ కంపెనీ అధికారులుగా నమ్మించిన దొంగల ముఠా, ఏకంగా సెల్ టవర్ ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసిన ఆ మొబైల్ కంపెనీ అధికారులు షాకయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యార్పూర్ రాజ్పుతానా ప్రాంతంలోని ఒక స్థలంలో 15 ఏళ్లుగా ఒక పెద్ద సెల్ టవర్ ఉంది. ఇటీవల ఆ స్థలం యజమాని వద్దకు కొందరు వచ్చారు. మొబైల్ కంపెనీ అధికారుల పేరుతో పరిచయం చేసుకున్నారు. అగ్రిమెంట్ ముగియడంతో సెల్ టవర్ను తొలగిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సుమారు 25 మంది వ్యక్తులు గ్యాస్ కట్టర్లు, పరికరాలతో అక్కడకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు శ్రమించి రూ.19 లక్షల విలువైన ఆ పెద్ద సెల్ టవర్ను ముక్కలుగా విడగొట్టారు. సెల్ టవర్ భాగాలను లారీలోకి లోడ్ చేసి తీసుకుపోయారు.
కాగా, మొబైల్ సిగ్నల్స్ సమస్య రావడంతో ఆ సంస్థకు చెందిన అధికారులు శనివారం ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉండాల్సిన సెల్ టవర్ మాయం కావడం చూసి షాకయ్యారు. స్థలం యజమాని నుంచి వివరాలు తెలుసుకున్నారు. సెల్ టవర్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బెగుసరాయ్ జిల్లాలోని రైల్వే యార్డ్లో రిపేర్ కోసం వచ్చిన డీజిల్ ఇంజిన్ను పలు దఫాలుగా దొంగలు చోరీ చేశారు. దీంతో రైలు ఇంజిన్ పూర్తిగా మాయం కావడం చూసి రైల్వే అధికారులు షాకయ్యారు. ఈ చోరీకి సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 95 శాతం రైలింజన్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు కాలువపై ఉన్న ఒక ఇనుప వంతెనను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇరిగేషన్ శాఖ అధికారులుగా నమ్మించి ఆ శాఖ సిబ్బంది, స్థానికుల సహాయంతో ఆ వంతెనను పలు భాగాలుగా విడగొట్టి లారీల్లో తీసుకెళ్లారు.