భోపాల్: గుడిలో చోరీ చేసిన దేవుడి వస్తువులను దొంగ తిరిగి ఇచ్చాడు. ఈ దొంగతంపై తాను చాలా బాధపడినట్లు ఒక లేఖలో పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 24న లామ్టా ప్రాంతంలోని జైన్ ఆలయంలో దొంగతనం జరిగింది. దేవుడికి వినియోగించే విలువైన వెండి, ఇత్తడి ఆభరణాలు, వస్తువులు చోరీ అయ్యాయి. ఆలయ అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, చోరీ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆలయం సమీపంలో ఒక సంచి పడి ఉంది. అక్కడి పంపు నుంచి నీరు పట్టుకుంటున్న జైన్ కుటుంబం దీనిని గమనించింది. ఆ సంచిని తెరిచి చూడగా ఆలయంలో చోరీ అయిన వెండి, ఇత్తడి వస్తువులు అందులో ఉన్నాయి. దీంతో ఆలయ అధికారులకు దీని గురించి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వాటిని పరిశీలించారు. ఆ సంచిలో ఒక లేఖ కూడా ఉండటాన్ని గమనించారు. ‘ఈ నేరం చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అందుకే ఈ వస్తువులను తిరిగి ఇస్తున్నాను. ఈ వస్తువులను దొంగిలించినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని అందులో రాసి ఉంది.
మరోవైపు ఆ వస్తువులను జైన్ ఆలయ అధికారులకు పోలీసులు అప్పగించారు. ఈ చోరీపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కాగా, చోరీ అయిన దేవుడి వస్తువులు తిరిగి ఆలయానికి చేరడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దేవుడి మహిమ వల్లనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.