తిరువనంతపురం: ఎవరూ లేని ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఆ ఇంట్లో కొంతకాలం ఉన్నాడు. ఇంట్లోని గృహోపకరణాలు అమ్మి ఫుడ్, మద్యం కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అయితే ఒక వస్తువు అమ్మే ప్రయత్నంలో స్థానికుల కంటపడటంతో అరెస్ట్ అయ్యాడు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి మున్నార్లో ఒక ఇల్లు ఉంది. వర్షాల వల్ల ఆ ఇల్లు పాడైంది. దీంతో మరో ప్రాంతంలోని సొంత ఇంట్లో ఆయన ఉంటున్నాడు. పాత ఇంట్లోని సామానులు అక్కడే ఉంచాడు. అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తుండేవాడు.
కాగా, ఆ ఇంట్లో ఎవరూ ఉండకపోవడాన్ని ఒక దొంగ గమనించాడు. బాత్రూమ్ రూఫ్ నుంచి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడి దుస్తులను నేలపై వేసుకుని పడుకునేవాడు. ఆ ఇంట్లోని గృహోపకరణాలు అమ్మి ఫుడ్, మద్యం కొనుగోలు చేసేవాడు. అలా కొన్ని రోజులు మస్త్గా ఎంజాయ్ చేశాడు.
అయితే ఒక రోజు ఆ ఇంట్లోని ఎల్ఈడీ టీవీని పట్టుకెళ్లి అమ్మేందుకు ఆ దొంగ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడ్ని గమనించి వివరాలు అడిగారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. కొందరు వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ నిందితుడ్ని మణికంఠన్గా గుర్తించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.