న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. శీతాకాల సమావేశాల రెండో రోజు ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఎల్జీ సక్సేనాను బ్రిటిష్ వైస్రాయ్తో పోల్చారు. బ్రిటిష్ పాలకుల నియంతృత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ కార్యకలాపాలకు ఎల్జీ పడుతున్నాడని మొదటిరోజైన సోమవారం కేజ్రివాల్ పేర్కొనగానే అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా కేజ్రివాల్ తాను చెప్పదలుచుకున్నది గట్టిగానే చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల టీచర్లను శిక్షణ కోసం ఫిన్లాండ్కు పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఎల్జీ అందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు.
ఢిల్లీలో రెండు కోట్ల జనాభా ఉన్నదని, వారిలో లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వాళ్లంతా నా కొడుకు, బిడ్డలాంటి వాళ్లేనని, వాళ్లందరికీ మంచి విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎల్జీ అడ్డుపడాల్సిన అవసరం ఏమున్నదని కేజ్రివాల్ ప్రశ్నించారు. టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణకు సంబంధించిన ఫైల్ను ఎల్జీ దగ్గరకు పంపిస్తే ఆయన తిరస్కరించారని సభకు చెప్పారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇవాళ తాము ఢిల్లీలో, వాళ్లు (బీజేపీ) కేంద్రంలో అధికారంలో ఉన్నారని, రేపు కేంద్రంలో తామే అధికారంలోకి రావచ్చని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మా మనిషే ఉంటారని అన్నారు. ఎల్జీకి మా నెత్తిన కూర్చునే అధికారం లేదని మండిపడ్డారు. ఆయన బ్రిటిష్ వైస్రాయ్లా వ్యవహరించవద్దని హితవు పలికారు.