న్యూఢిల్లీ: ఓ కేంద్ర మంత్రి తనయుడు ఆందోళన చేస్తున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీతోపాటు పలువురు ఇతర నేతలు బాధిత కుటుంబాలను కలవడానికి వెళ్తుండగా.. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.
సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రియాంకాతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రియాంకా.. వారెంట్ చూపించండి అంటూ వాళ్లను నిలదీశారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా స్పందించారు.
నీ ధైర్యాన్ని చూసి వాళ్లు భయపడ్డారు. నువ్వు వెనుకడుగు వేయవని నాకు తెలుసు. న్యాయం కోసం జరుగుతున్న ఈ అహింసా ఉద్యమంలో మనం దేశ రైతులు విజయం సాధించేలా చేద్దాం అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లగా నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఆందోళనల్లో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో ఆశిశ్ మిశ్రాపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు