పనాజీ: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మమతాబెనర్జి మరోసారి నిప్పులు చెరిగారు. అచ్చేదిన్ అచ్చేదిన్ అంటూనే దేశాన్ని సర్వనాశనం చేశారని ఆమె మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం గోవాలో మకాం వేసిన మమతాబెనర్జి.. ఇవాళ గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్తో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇంకా ఇతర చిన్నాచితకా పార్టీలు కలిసి పోటీచేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మమతాబెనర్జి బీజేపీ పరిపాలనా తీరును ఎండగట్టారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకే పెరిగిపోతున్నది. గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు అసలు అడ్డుకట్టేలేదు. జీఎస్టీ కారణంగా దాదాపు అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. అయినా అధికార బీజేపీకి సమస్యలను పరిష్కారించాలన్న సోయి లేదు. పైగా, వాళ్లు ఇంకా అచ్చేదిన్ (మంచి రోజులు) రానున్నాయని చెబుతున్నారు. కానీ దేశం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది అని మమతాబెనర్జి మండిపడ్డారు.
బీజేపీయేతర శక్తులన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి ఆ పార్టీని అంతటా ఓడించడమే లక్ష్యంగా తాము పోరాడుతామని మమతాబెనర్జి చెప్పారు. కొద్దిసేపటి క్రితమే గోవా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్తో మాట్లాడానని, కలిసి పోటీచేసే విషయంపై ఇద్దరం చర్చించామని అన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆయన ఇష్టమని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలి పోకూడదనేది తన ఉద్దేశమన్నారు. కాగా, విజయ్ సర్దేశాయ్ కూడా మమతపై ప్రశంసలు కురిపంచారు. పార్టీలో చర్చించి పొత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు.