గాంధీనగర్, అక్టోబర్ 23: కుక్కలేంటి.. కోటీశ్వరులేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివింది నిజమే. గుజరాత్లోని బనస్కాంత జిల్లా కుష్కల్లో 200 కుక్కలున్నాయి. ఇవి ఎప్పుడూ ఆహారం కోసం వెతకవు. అవి ఉన్న చోటకే గ్రామస్థులు వచ్చి కిచిడీ, రోటీ, పాలతో చేసిన పదార్థాలు తినిపించి వెళ్తుంటారు. ఈ కుక్కలు ఆ గ్రామంలో దర్జాగా నివసిస్తాయి. తరతరాలుగా గ్రామస్థులే వాటి ఆలనాపాలనను విధిగా నిర్వర్తిస్తుంటారు. ఎందుకంటే ఇవి 8.5 ఎకరాల అత్యంత విలువైన భూమికి ఆసాములు. ఈ భూమి విలువ దాదాపు రూ.2.5 కోట్ల పైమాటే. ఈ భూమి మొత్తం కూడా ‘సమస్త్ గావ్ కుత్రానీ’ అనే కమిటీ పేరిట రిజిస్టర్ అయ్యి ఉంది. 12 మంది కమిటీ సభ్యులు ఈ భూమికి సంరక్షకులుగా వ్యవహరిస్తారు. ఈ భూమిని అమ్మే హక్కు వీళ్లకు ఉండదు. కేవలం అందులో కుక్కల కోసం ఏం పండించాలి, వాటికి ఎలాంటి ఆహారం అందించాలనేది నిర్ణయిస్తుంటారు. ఈ భూమిని 300 ఏండ్ల క్రితం మొఘల్ నవాబ్ తాలిబ్ మహ్మద్ ఖాన్ కుక్కల పేరుపై రాశారు. ఆ కాలంలో ఆహారం లేక కుక్కలు ఆకలితో అలమటించడాన్ని చూసి చలించిపోయిన నవాబు ఈ భూమిని వాటి పేరుపై రిజిస్టర్ చేశారు.