బెంగళూరు: కర్ణాటకలో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (PSI) రిక్రూట్మెంట్ స్కామ్ బాధితులపై తుమకూరు డీప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ దాడి చేయడంపై.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి మానవత్వం లేదన్నారు. ఆ పార్టీ నేతలెప్పుడూ అమానవీయ ఘటనలకు పాల్పడుతూనే ఉంటారని విమర్శించారు.
బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి కూడా వారం రోజుల క్రితం వీ సోమన్న ఒక మహిళను చెంపదెబ్బ కొట్టాడని, ఆ దెబ్బకు ఆమె కిందపడిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు తుమకూరులో హోంమంత్రిని కలిసేందుకు వెళ్లిన PSI రిక్రూట్మెంట్ స్కామ్ బాధితులపై అక్కడి డిప్యూటీ ఎస్పీ చేయిచేసుకున్నాడని, కర్ణాటకలో ఇలాంటి మంత్రులు ఉన్నారని సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు.