లక్నో: గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. 1985 తర్వాత యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక యోగి గెలుపులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. గతంలో గుండాయిజం, నేరాలకు అడ్డాగా మారిన ఆ రాష్ట్రాన్ని యోగి తన విధానాలతో మార్చేశారు. అక్రమాలు, అన్యాయాలకు పాల్పడుతున్న నేరస్థుల పని పట్టారు. రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేశారు.
క్రైమ్ను అణిచివేయడంలో సీఎం యోగి సక్సెస్ సాధించారు. ఇక కరోనా మహమ్మారి వేళ కూడా యోగి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆ పార్టీని గెలుపు బాట పట్టించాయి. కరోనా సంక్షోభ సమయంలో దేశం నలుమూలల నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన ప్రజలకు ఉచిత రేషన్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా చేపట్టినట్లు చెప్పుకున్నారు. అందుకే యూపీ ప్రజలు బీజేపీని ఆశీర్వదించినట్లు నిపుణులంటున్నారు.
ఈ రెండు అంశాలతో పాటు ప్రాచీన ఆలయాలకు పున ప్రతిష్ట తీసుకువచ్చేందుకు కూడా సీఎం యోగి అసాధారణ ప్రయత్నం చేపట్టారు. భక్తి భావనతో ఊగిపోయే యూపీలో .. అయోధ్య, కాశీ ఆలయాల సుందరీకరణ కూడా యోగికి కలిసివచ్చిందని భావించవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్ తాజా రిపోర్ట్ ప్రకారం .. 246 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. 120 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో కొనసాగుతోంది.