Sameer Wankhede | బాలీవుడ్ బాద్షా షారుక్ తనయుడు ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సమీర్ వాంఖడే త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఆర్యన్ ఖాన్పై కేసు, ఎన్నికల్లో పోటీ, తనపై వచ్చిన ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని.. అందులో కులం, మతానికి సంబంధించి ఎన్నో వ్యాఖ్యలు చేశారన్న సమీర్ వాంఖడే.. ఆ ఆరోపణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరోపణలతో దేశానికి సేవ చేసే సమయం వృథా అయ్యిందన్నారు. తనపై ప్రస్తుతం ఇంకా ఏడెనిమిది కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటితో సమయం వృథా అవుతుందన్నారు.
తనపై పెండింగ్లో ఉన్న కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసుపై స్పందిస్తూ.. తనకు అన్ని కేసులు సమానమేనన్నారు. తన కెరియర్లో ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయని.. అయితే, తమకు హై ప్రొఫైల్, లో ప్రొఫైల్ కేసులనే తేడా లేదన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. సమీర్ వాంఖడే ఆర్యన్ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ సహా పలు ఇతర హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారు. ఎన్సీబీలో ఉండగా ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను చెన్నైలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ టాక్స్ పేయర్ సర్వీసెస్లో అదనపు కమిషనర్గా బదిలీ అయ్యారు.
ప్రస్తుతం ఆ కేసుల పురోగతి ఎలా ఉందో..? ఏం జరుగుతుందో తెలియదన్నారు. డిపార్ట్మెంట్ను టార్గెట్ చేశారన్న ఆరోపణలపై వ్యాఖ్యనించేందుకు నిరాకరించారు. కోర్టు నుంచి అనుమతి పొందిన అనంతరం ఆ విషయాలపై స్పందిస్తానన్నారు. హై ప్రొఫైల్ కేసుల్లో నగదు లావాదేవీలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ‘ఎవరూ బీ బృందం ఎన్ని దాడులను ఎదుర్కొంది ? ఎంత మంది డ్రగ్స్ స్మగ్లర్లు పట్టుబడ్డారు ? ఎంత మంది పిల్లలకు పునరావాసం కల్పించారు ? అని ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎందుకు అడుగరు. జనం ఒకే కేసు గురించి మాట్లాడుతారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీబీలో తమ బృందం ఎన్నో భారీ, ముఖ్యమైన కేసులను పరిష్కరించిందని.. పెద్ద సంఖ్యలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుందన్న ఆయన జనం ఎప్పుడూ చిన్న కేసుల గురించే మాట్లాడుతారన్నారు.
తన 18 సంవత్సరాల కెరీర్లో తనపై ఎప్పుడూ ఆరోపణలు రాలేదని.. ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తన జీవితంపై ఎలాంటి పశ్చాతాపం లేదని.. భారతమాతకు సగర్వంగా సేవ చేశానన్నారు. తాను ఒక్క క్షణం చింతించనని.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తే ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటానన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. ‘భవిష్యత్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను పాటించే సూత్రం ఏంటంటే.. దేశమే ఫస్ట్. భవిష్యత్లో ఏ రూపంలోనైనా పని చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. నా గౌరవం, సమాజం కోసం పోరాడుతూనే ఉంటాను’ అని సమీర్ వాంఖడే తెలిపారు.