న్యూఢిల్లీ, జూలై 10: ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా మరింత పెరగనున్నది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, వస్తువులు, మద్యం తదితర ఉచితాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు వాటిని అరికట్టాలని పన్ను అధికారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) సూచించింది. తమకు తెలిసిన సమాచారాన్ని ఇతర సంస్థలతోనూ పంచుకోవాలని తెలిపింది.
త్వరలో జరగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీలు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. కూపన్ ఆధారిత నగదు, ఉచిత పెట్రోల్ పంపిణీపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించాలని సీబీఐసీ ఆదేశించింది. అభ్యర్థుల పెట్రోల్, డిజీల్, హోటల్ ఖర్చులను పర్యవేక్షించాలని తెలిపింది. జీఎస్టీ అధికారులు నిఘా బృందాలను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయాలని సూచించింది.