న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ టన్నెల్(Uttarakhand Tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. ఆ వర్కర్లు సుమారు 17 రోజుల పాటు సొరంగంలోనే గడిపారు. టన్నెల్లో ట్రాప్ అయిన తర్వాత సుమారు 18 గంటల పాటు కాంటాక్ట్ కోల్పోయినట్లు అఖిలేశ్ సింగ్ అనే వర్కర్ తెలిపాడు. టన్నెల్లో ఎదురైన అనుభవాలను బాధితులు మీడియాకు తెలిపారు. ఇంటికి వెళ్దామని బయటకు వస్తున్న సమయంలో టన్నెల్ కూలినట్లు ఓ బాధిత వర్కర్ తెలిపాడు. తన కండ్ల ముందే టన్నెల్ కూలిందని, భారీ శబ్ధం వచ్చిందని, ఆ శబ్ధానికి తన చెవులు వినికిడి కోల్పోయినట్లు అఖిలేశ్ సింగ్ చెప్పాడు. 18 గంటల పాటు మరో సమాజంతో లింకు లేదని, అయితే తమకు ఇచ్చిన శిక్షణ ప్రకారం ట్రాపైన ప్రాంతంలో ఉన్న ఓ వాటర్ పైప్ను ఓపెన్ చేశామని, ఆ పైప్ ద్వారా నీటిని వదలడం ప్రారంభించిన తర్వాత మరో వైపు ఉన్న వాళ్లకు తమ గురించి తెలిసిందని, అప్పుడు వాళ్లు ఆక్సిజన్ పంపడం ప్రారంభించారని అఖిలేశ్ చెప్పాడు.
కూలిన శిథిలాల నుంచి స్టీల్ పైప్ను అమర్చిన తర్వాత ఆ పైప్ ద్వారా ఆహారాన్ని పంపిణీ చేశారన్నారు. టన్నెల్లో సుమారు 25 రోజుల పాటు సరిపడ ఆహారం ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. హెల్త్ చెకప్ ముగిసిన తర్వాత స్వంత గ్రామం వెళ్తానని, రెండు నెలల బ్రేక్ తర్వాత మళ్లీ పనికి వెళ్లనున్నట్లు చెప్పాడు. ఛార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ఉత్తరకాశీ టన్నెల్లో నిర్మాణం జరుగుతున్నది. అయితే నవంబర్ 12వ తేదీన సిల్కియారా టన్నెల్ ఎంట్రెన్స్ నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న గుహ కూలిపోయింది. దీంతో మరో వైపు ఉన్న కార్మికులు ఆ టన్నెల్లో చిక్కుకుపోయారు.