యూపీలో బీజేపీ బంపర్ విజయం సాధించింది. మొత్తం 400 స్థానాలకు గాను, మిత్ర పక్షాలతో కలిసి 273 స్థానాలను కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 20 తర్వాతే సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎంల విషయంలో యోగి, బీజేపీ అధిష్ఠానం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మొత్తం నలుగుర్ని డిప్యూటీ సీఎంలుగా ప్రకటించనున్నారు. యోగి మొదటి టర్మ్లో కేవలం ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే వుండేవారు. దినేశ్ శర్మ ఒకరు. కేశవ ప్రసాద్ మౌర్య మరొకరు. ఈసారి మాత్రం పాలనా సౌలభ్యం కోసం మరో ఇద్దర్ని పెంచి, మొత్తం నలుగుర్ని డిప్యూటీ సీఎంలుగా చేయనున్నారు.
రేసులో వున్నది వీరే….
బేబీ రానీ మౌర్య, బ్రజేశ్ పాఠక్, స్వతంత్ర దేవ్ సింగ్, కేశవ ప్రసాద్ మౌర్య.. ఈ నలుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమించనున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న కేశవ ప్రసాద్ మౌర్య ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా… రాజకీయ సమీకరణాలు, సీనియారిటీ ప్రకారం తిరిగి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం రెడీ అయినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంగా ఉన్న మరో నేత.. దినేశ్ శర్మను కేబినెట్ నుంచి తొలగించి, పార్టీ విస్తరణ, పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేయనున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించాల్సి వుంది.