శ్రీనగర్: శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ విద్యార్థి మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఎన్ఐటీ పరిపాలన విభాగం విద్యార్థులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించింది.
గురువారం నుంచే ఈ సెలవులు అమల్లోకి వస్తాయని, విద్యార్థులు తక్షణమే హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే ఉన్నపళంగా హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంతూళ్లకు వెళ్దామంటే సమయానికి రైళ్లు కూడా అందుబాటులో లేవని, ఇప్పటికిప్పుడు ఎటు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.