పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ భద్రతపై పదే పదే నిర్లక్ష్యం వహిస్తున్నారని లోక్ జనశక్తి పార్టీ (ఆర్) అధినేత చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ఆయనపై దాడి జరుగడం ఇది రెండోసారి అని తెలిపారు. ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. సీఎం నితీశ్ భద్రత పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం నలందాలోని సిలావ్ అనే పాఠశాలలో జరిగిన ఓ సభలో సీఎం నితీశ్ పాల్గొన్నారు. ఆయన ఉన్న ప్రాంతానికి కేవలం 18 అడుగుల దూరంలో బాంబు దాడి జరుగడం కలకలం రేపింది. పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది బాంబు దాడి కాదని, కొందరు వ్యక్తులు పటాకులు పేల్చారన్నది మరో వాదన.
అలాగే కొన్ని రోజుల క్రితం సీఎం నితీశ్ కుమార్పై ఓ యువకుడు దాడికి ప్రయత్నించాడు. భక్తియార్ పూర్లో ఈ ఘటన జరిగింది. సీఎం నితీశ్ ఓ విగ్రహానికి పూల మాల వేస్తుండగా, సెక్యూరిటీని తప్పించుకొని ఆయన వద్దకు వెళ్లిన ఓ యువకుడు వెనుక నుంచి దాడికి యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ యువకుడ్ని పక్కకు లాగి అదుపులోకి తీసుకున్నారు.