Assam | డిస్పూర్, ఆగస్టు 27: పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు అన్న మాటను ప్రభుత్వాలు విస్మరించడంతో ఒకప్పుడు అభివృద్ధితో కళకళలాడిన అస్సాంలోని ఒక గ్రామం ఇప్పుడు బీడువాడి వెలవెలపోయింది. జనంతో నిండుగా ఉండే ఆ గ్రామాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఒకే ఒక్క కుటుంబం నివసిస్తుందంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజం. అస్సాంలోని నల్బరి జిల్లా బార్ద్నారా గ్రామంలో ఐదుగురు సభ్యులున్న ఒక్క కుటుంబం మాత్రమే ఆవాసం ఉంటున్నది. బిమల్ డేకా, అతని భార్య అనిమా, వారి ముగ్గురు పిల్లలు నరేన్, దీపాలి, సేతు మాత్రమే బిక్కుబిక్కుమంటూ గ్రామంలో గడుపుతున్నారు. ఒకప్పుడు జనం, పొలాలతో కళకళలాడిన ఆ గ్రామంలో రోడ్డు, విద్యుత్తు, రవాణా వంటి కనీస సౌకర్యాలు కరవవ్వడంతో ఒక్కొక్కరుగా గ్రామాన్ని వదిలి వెళ్లారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 16 మంది మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకు దిగజారింది.
తమ పిల్లలను స్కూల్, కాలేజీకి పంపాలంటే బురదతో నిండిన మార్గంలో రెండు కిలోమీటర్లు నడిచి దగ్గరలోని రోడ్డుకు చేరుకోవాల్సి ఉందని, ఇక వర్షాకాలం అయితే ఆ పరిస్థితి కూడా ఉండదని, నాటు పడవలోనే ఊరు దాటక తప్పదని బీమాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో తమ పిల్లల చదువుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, కిరోసిన్ దీపాలతోనే వారి చదువు కొనసాగుతున్నదని తెలిపారు.