న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఆందోళనకరమైన కొత్త వేరియంట్ ఏదీ లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా సమాచారం ప్రకారం ప్రమాదకర వైరస్లు ఏవీలేవన్నారు. జైడస్ క్యాడిల్లా కోవిడ్ టీకాలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. జైడస్ టీకాను సాంప్రదాయ సిరంజీతో వేయమని, దానికి ప్రత్యేకమైన అప్లికేటర్ కావాలని, తొలిసారి దేశంలో అలాంటి పద్ధతిని వాడబోతున్నామని, అయితే ఆ విషయంలో శిక్షణ జరుగుతున్నట్లు పౌల్ వెల్లడించారు. జైడస్ టీకాను తీసుకురావడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కనీసం 1200 పీఎస్ఏ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, త్వరలోనే ఆ సంఖ్యను 4000 పీఎస్ఏలకు చేర్చనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆక్సిజన్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇదోరకమైన భద్రత అని ఆయన అన్నారు. జాతీయ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లోకి జైడస్ను త్వరలోనే తీసుకువస్తామని పౌల్ వెల్లడించారు.