BJP | న్యూఢిల్లీ, డిసెంబర్ 24: డబ్ల్యూఎఫ్ఐ వివాదాన్ని విపక్షాలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తాయని అధికార బీజేపీ భావిస్తున్నది. అందుకే నష్ట నివారణలో భాగంగానే ప్రభుత్వం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కు గుడ్బై చెప్పడం, మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనం సృష్టించింది. దేశానికి పతకాలు తెచ్చిన వారికి మోదీ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అన్న చర్చలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నది. క్రీడా, రాజకీయ రంగాల్లో ఈ అంశం ప్రతికూల ప్రభావం చూపనుంది. దీని వలన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో భారత్ ప్రతిష్ఠ మసకబారుతుందని భావిస్తున్నారు.
మహిళ, జాట్ ఓటర్లపై ప్రభావం
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల అంశాన్ని 2024 ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు కనుక ప్రచారం చేస్తే అది మహిళా, జూట్ ఓటర్లపై ప్రభావం పడి బీజేపీని గట్టి దెబ్బే తీస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తలు హెచ్చరించారు. ఈ క్రమంలోనే బ్రిజ్ భూషణ్ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ పిలిచి చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇక నుంచి రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు శనివారం బ్రిజ్ భూషణ్ ప్రకటించారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే బీజేపీ ఆయనతో ఈ ప్రకటన చేయించినట్టు సమాచారం.