Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశ జనాభాలో దాదాపు 48.5 శాతం ఉన్న అతివలు.. లోక్సభలో మాత్రం కేవలం 14 శాతం మాత్రమే ఉన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య విషయాన్ని అటుంచితే, కనీసం ఎన్నికల్లో పోటీచేసే మహిళల సంఖ్య కూడా అత్యంత తక్కువగా ఉండేది. ఇందుకు రాజకీయ పార్టీలు మహిళలకు పోటీచేసేందుకు అవకాశాలు కల్పించకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఏండ్లు గడిచే కొద్దీ ఈ పరిస్థితిలో కొంతమేర మార్పు కనిపించింది.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరుగడంతోపాటుగా, లోక్సభకు ఎన్నికయ్యే మహిళా ఎంపీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. 1957తో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల నాటికి పోటీచేసే మహిళా అభ్యర్థుల సంఖ్య 16 రెట్లు పెరిగింది. ఆ నాడు కేవలం 45 మంది మహిళలు మాత్రమే ఎన్నికల్లో పోటీచేయగా.. ఈ సంఖ్య 2019 ఎన్నికల నాటికి 726కి పెరిగింది. అయితే పురుషులతో పోలిస్తే.. అభ్యర్థిత్వం విషయంలోగానీ, పార్లమెంట్లో వారి ప్రాతినిథ్యంలోగానీ భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది.
ఏడు దశాబ్దాల్లో 4 నుంచి 14 శాతానికే..
గతంతో పోలిస్తే ఓవైపు లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే మహిళా అభ్యర్థుల సంఖ్య పెరుగడంతోపాటు.. పార్లమెంట్లో మహిళా ఎంపీల ప్రాతినిథ్యం కూడా కొంత మేర పెరిగింది. 1957లో లోక్సభలో 4.5 శాతం మంది మహిళా ఎంపీలు ఉండగా.. 2019నాటికి ఇది 14.4 శాతానికి పెరిగింది. 1957-2019 మధ్య ఏడు దశాబ్దాల కాలంలో మహిళా అభ్యర్థుల సంఖ్య 16 రెట్లు పెరుగ్గా, పురుష అభ్యర్థులు ఐదు రెట్లు అయ్యారు.
అయితే సంఖ్య విషయంలో పురుషులు, మహిళా అభ్యర్థుల మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి మహిళలకు సరైన అవకాశాలు లేకపోవడమే కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. మహిళా అభ్యర్థుల్లో గెలుపు శాతం అధికంగా ఉన్నప్పటికీ, వారికి అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించడం లేదని మహిళా హక్కుల కార్యకర్త రంజనా కుమారి అన్నారు. ఒకవేళ సీటు కేటాయించినా.. బలమైన అభ్యర్థులపై పోటీచేయించడమో లేదా అంగ, అర్థ బలం ఉన్నవారికి వ్యతిరేకంగా నిలబెట్టడం వంటివి జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈసారి ఎన్నికల్లోనూ అదే పరిస్థితి
2024 లోక్సభ ఎన్నికల విషయంలోనూ పెద్ద తేడా కనిపించడం లేదు. యూపీలో జరిగే మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న 80 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. 2019లో మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో 91 మంది పోటీదారుల్లో మహిళా అభ్యర్థులు 12 మంది. అయితే ఈ పన్నెండు మందిలో తొమ్మిది మంది విజయం సాధించడం గమనార్హం. కాగా, కేంద్రంలోని అధికార బీజేపీ ఇప్పటి వరకు 417 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో మహిళలు కేవలం 68 మంది (16 శాతం) మాత్రమే ఉన్నారు.