తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో చోరీ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆలయంలో ఉండే భండారంలో హుండీలను లెక్కిస్తారు. అయితే ఆ హుండీ లెక్కింపు సమయంలో ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు డబ్బులు చోరీ చేస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఓ ఉద్యోగి ఇలాగే చోరీకి పాల్పడ్డాడు. ట్రావన్కోర్ దేవస్థానం బోర్డులో ఉద్యోగి అయిన అతని వద్ద నుంచి సుమారు 42 వేలు రికవరీ చేశారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన కూడా చోరీ జరిగింది.ఓ ఉద్యోగి భండారం నుంచి డబ్బులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అతని వద్ద నుంచి 3500 రికవరీ చేశారు. ఈ ఘటనల పట్ల కేరళ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన ఆఫీసర్ అవసరమని కోర్టు పేర్కొన్నది. ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి నేరం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డును కోర్టు ఆదేశించింది.