నాడు కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసింది. ఈ ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం చివరికి సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నది.
నేడు బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన పోరాటానికి దేశ ప్రజలు అండగా నిలుస్తున్నారు. రైతు ఉద్యమ విజయంలా వీరి పోరాటం గెలువాలని ఆకాంక్షిస్తున్నారు.
Wrestlers protest | న్యూఢిల్లీ, మే 31: రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించాయి. బ్రిజ్భూషణ్పై రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా, చట్టప్రకారంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశాయి. రెజ్లర్లకు తగిన రక్షణ కల్పించి, వేగంగా విచారణ పూర్తి చేయాలని పేర్కొన్నాయి. రెజ్లర్లను పోలీసులు నిర్బంధించడం, అరెస్టులు చేయడం, జంతర్మంతర్ వద్ద వారి దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించడంపై యూడబ్ల్యూడబ్ల్యూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నించింది. రెజ్లర్లపై పోలీసుల వ్యవహారశైలి తీవ్ర ఆందోళనపరిచేదిగా ఉన్నదని ఐవోసీ పేర్కొన్నది.
భారత రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే డబ్ల్యూఎఫ్ఐ సస్పెన్షన్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరించింది. ఈ సస్పెన్షన్ అమలైతే, భారత రెజ్లర్లు అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో న్యూట్రల్ ఫ్లాగ్(ఏ దేశానికీ చెందని వారుగా) కింద ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది మొదట్లో న్యూఢిల్లీలో జరగాల్సిన ఆసియన్ చాంపియన్షిప్ను వేరే చోటుకు మార్చిన విషయాన్ని యూడబ్ల్యూడబ్ల్యూ గుర్తుచేసింది.
బ్రిజ్భూషణ్పై కేసు విచారణ కొనసాగుతున్నదని, కోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఢిల్లీ పోలీసులు బుధవారం వెల్లడించారు. బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని, 15 రోజుల్లో కోర్టుకు నివేదిక సమర్పిస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. అ వార్తలు తప్పు అని, దర్యాప్తు కొనసాగుతున్నదని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ను పోక్సో చట్టం కింద ఎందుకు అరెస్టు చేయడం లేదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్నించారు. అతను బీజేపీకి చెందిన ఎంపీ కాబట్టే కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. పోక్సో, తక్షణ అరెస్టు ఇతర నిందితులకు వర్తించినప్పుడు, బ్రిజ్భూషణ్కు ఎందుకు వర్తించవని నిలదీశారు. బీజేపీ చెప్పే ‘బేటీ బచావో-బేటీ పడావో’ నినాదం ‘బీజేపీ నేతల నుంచి ఆడబిడ్డలను కాపాడండి’ అనేవిధంగా తయారైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
సంయుక్త కిసాన్ మోర్చా గురువారం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అదేవిధంగా గురువారం యూపీలోని ముజఫర్నగర్లో ‘మహాపంచాయత్’ నిర్వహించనున్నట్టు బీకేయూ నేత నరేశ్ టికాయిత్ ప్రకటించారు. యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల నుంచి పలు ఖాప్ల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. రెజ్లర్లకు మద్దతుగా జూన్ 4న దేశవ్యాప్త ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ పిలుపిచ్చాయి.
బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్కేఎం తెలంగాణ కన్వీనర్లు టీ సాగర్, పశ్య పద్మ, పీ ప్రభాకర్, పెద్దారపు రమేష్, మండల వెంకన్న, జకుల వెంకటయ్య, మామిడాల భిక్షపతి తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ, బ్రిజ్భూషణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని నేతలు వెల్లడించారు.
రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. క్రీడాకారులు, సాధారణ ప్రజలు పెద్దయెత్తున హాజరయ్యారు. ‘రెజ్లర్లకు న్యాయం చేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేవరకు వెళ్లే పరిస్థితులను కేంద్రం తీసుకొచ్చిందని మమత మండిపడ్డారు. బ్రిజ్భూషణ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.